ప్రముఖ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “వేదవ్యాస్”కు సంబంధించిన బ్యానర్ ఆవిష్కరణ వేడుక గురువారం ఘనంగా జరిగింది. కె. అచ్చిరెడ్డి సమర్పణలో, నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం “సాయి ప్రగతి ఫిలిమ్స్” అనే బ్యానర్ను అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని షిర్డీ సాయి బాబా దేవాలయంలో శాస్త్రోక్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు కృష్ణారెడ్డి, సమర్పకుడు అచ్చిరెడ్డి, నిర్మాత ప్రతాపరెడ్డి సంప్రదాయ పంచెకట్టులో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ ఇష్టదైవమైన సాయిబాబా సమక్షంలో బ్యానర్ లోగోను ఆవిష్కరించగా, ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన చిత్ర బృందం, హైందవ ధర్మ విశిష్టతను ప్రతిబింబించేలా, సైంటిఫిక్ అప్రోచ్తో కూడిన సకుటుంబ కథాంశంతో “వేదవ్యాస్” చిత్రం తెరకెక్కుతోందని వెల్లడించింది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతుండగా, కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ తెలుగు తెరకు పరిచయం కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అంతేకాకుండా సాయికుమార్, సుమన్, బాబు మోహన్, శివాజీ రాజా, అలీ, ఉత్తేజ్, రఘు బాబు, అజయ్ ఘోష్, ఐమాక్స్ వెంకట్, విద్యులేఖ రామన్, రాజేశ్వరి నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం వంటి ఐదు ప్రధాన బాధ్యతలను ఎస్.వి. కృష్ణారెడ్డి స్వయంగా నిర్వహిస్తున్నారు. పాటలను భువనచంద్ర, వెనిగళ్ల రాంబాబు రాయగా, సినిమాటోగ్రఫీ శరత్, కొరియోగ్రఫీ సుచిత్ర, ఎడిటింగ్ చోటా కె. ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనింగ్ బ్రహ్మ కడలి నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఫణి శ్రీనివాస రెడ్డి మేడపాటి వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం, భిన్నమైన కథాంశంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.




