ఇటీవల కాలంలో తెలుగు దర్శకులు హిందీ హీరోలతో, హిందీ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు రూపొందిస్తూ సరికొత్త కాంబోలను శ్రీకారం చూడుతున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటికే పలువురు స్టార్ డైరెక్టర్స్ అక్కడి టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. రణ్బీర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ను, సన్నీడియోల్ హీరోగా గోపీచంద్ మలినేని ‘జాట్’ను రూపొందించి సూపర్ సక్సెస్లను అందుకున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా రాబోతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. రీసెంట్గా అఫీషియల్గా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయగా, శనివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈరోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ను కూడా స్టార్ట్ చేస్తున్నట్టు రివీల్ చేస్తూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి సోషల్ మీడియా వేదికగా ‘అన్నీ ఈరోజు నుంచే ప్రారంభం’ అంటూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ముహూర్తపు షాట్ రాసున్న క్లాప్ బోర్డ్ ఫొటోను షేర్ చేశారు. సల్మాన్ ఇమేజ్కు తగ్గట్టుగా అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాస్ సరసన నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉండబోతోందని, నయనతార లాంటి పవర్ఫుల్ నటిని ఆ పాత్రకు ఎంపిక చేసినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. సౌత్ హీరోయిన్స్లో సూపర్స్టార్గా వెలుగుతున్న నయనతారకు.. బాలీవుడ్లో ఇది రెండో సినిమా. షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్.. తొలిచిత్రంతోనే హిందీలో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నయన్.. సల్మాన్ ప్రాజెక్ట్లో చేరడం సినిమాకు మరింత బజ్ తీసుకువచ్చింది. అలాగే తమిళ హీరో విజయ్తో తీసిన ‘వారసుడు’ తర్వాత వంశీ పైడిపల్లి చేయబోతున్న సినిమా ఇదే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) బ్యానర్లో 63వ చిత్రం. దీన్నొక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా మేకర్స్ భావిస్తున్నారు. సల్మాన్ సినిమాలు ఈద్ సీజన్లో రిలీజ్ కావడం అనే సెంటిమెంట్ను కొనసాగిస్తూ వచ్చే ఏడాది ఈద్ ఈద్ సందర్భంగా మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా అపూర్వ లఖియా తెరకెక్కించిన ‘మాతృభూమి’ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది.





