సత్యదేవ్, దీపా థామస్ జంటగా దర్శకుడు వెంకటేష్ మహా రూపొందిస్తున్న చిత్రం ‘రావు బహదూర్’. సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన జిఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్కు మంచి రెస్పాన్స్ రాగా, తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి మొదటిపాటను విడుదల చేశారు. ‘ఓ సుందరి’ అంటూ సాగే పాటను రిలీజ్ చేయగా, దీనిని స్మరణ్ సాయి కంపోజ్ చేశారు. విజయ్ యేసుదాస్ పాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వింటేజ్ బ్యాక్డ్రాప్లో సాగిన ఈ పాటలో సత్యదేవ్, దీపా థామస్ జోడీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘‘ఈ పాట వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. నేను సినిమాలకు వచ్చిన కొత్తలో కమల్ హాసన్ గారి లాంటి పాత్రలు ఎప్పుడైనా వస్తుందా అని అనుకునేవాడిని. ఒక రోజు వెంకటేష్ మహా ఈ కథ చెప్పారు. షూటింగ్ మొదటి రోజు ఉదయం మూడు గంటలకు సెట్లోకి వెళ్లి రాత్రి రెండు గంటల వరకు షూటింగ్ చేశాను. రామప్ప పాత్ర కోసం ప్రతిరోజూ ఐదు గంటల మేకప్ పట్టేది. ఇలా ఐదు రోజులు గడిచాక టెన్షన్ వచ్చి “ఇంకా ఎన్ని రోజులు ఇలా?” అని అడిగాను. దాదాపు 85 రోజులు అని చెప్పారు. అప్పుడు నా పని అయిపోయింది అనుకున్నాను. అలాంటి సమయంలో ‘ఓ సుందరి’ పాట వినిపించారు. ఆ పాట మాకు డిటాక్స్లా అనిపించింది. ఈ పాట మహిళలను సెలబ్రేట్ చేసేలా ఉంటుంది. మా నిర్మాతలు ఇంత ఆనందంగా ఉన్నారంటే, దర్శకుడు మహా ఎంత అద్భుతంగా ఈ సినిమా తీశాడో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి, అవతార్ లాంటి సినిమాలు ఆ స్కేల్లో ఎలా అయితే మిమ్మల్ని కూర్చోబెట్టగలిగాయో మా రావు బహుదూర్ సినిమా కూడా మిమ్మల్ని అంతే స్థాయి లో అలరిస్తుంది. ఇది నా ప్రామిస్. ఈ సినిమా అందరినీ మెస్మరైజ్ చేస్తుంది. వెంకటేష్ మహా దేశం మొత్తం తిరిగి ఈ కథ రాశాడు. సీతమ్మ వాకిట్లో సినిమాలో మహేష్ గారితో కలసి నటించాను. కానీ సినిమాలో ఆ సీన్ కొన్ని కారణాల వలన ఉంచడం కుదరలేదు. ఇప్పుడు మహేష్ బాబు గారు నా సినిమాను ప్రజెంట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా”అని అన్నారు. ఈ చిత్రం తనకు గోల్డెన్ చాన్స్ అని హీరోయిన్ దీప థామస్ చెప్పారు. దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ ‘‘ దాదాపు ఐదేళ్ళ తర్వాత నా సినిమాకి జరుగుతున్న తొలి ఈవెంట్ ఇది. మహేష్ గారు, నమ్రత గారు, శరత్, అనురాగ్, గోపాల్ కృష్ణ గారు నాకు ఫైవ్ అవెంజర్స్. సత్య నా క్రియేటివ్ సోల్మేట్. ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ సినిమా మీకు ఇచ్చిన అనుభూతికి పది రెట్లు అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో ‘రావు బహదూర్’ తీశాను. ఈ సినిమా అందరికీ మంచి థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నా”అని అన్నారు. ప్రొడ్యూసర్ అనురాగ్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి. మహేష్ గారు రాజమౌళి గారు కలిసి చేస్తున్న వారణాసి సినిమాని ఎలాగైతే వరల్డ్ వైడ్ తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారో, మహేష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాని కూడా ఆ స్థాయిలో తీసుకువెళ్లాలని, అలాంటి సినిమాలే తీయాలని తపనతో ఉన్నారు. ‘ఓ సుందరి’ పాట జీవితాంతం గుర్తుండిపోతుంది. జూన్లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు. ఈ సినిమా గొప్ప థియేట్రికల్ అనుభూతి ఇస్తుందని నిర్మాతలు శరత్ చంద్ర, గోపాలకృష్ణారెడ్డి అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి, సింగర్ విజయ్ యేసుదాస్ సహా టీమ్ అంతా కార్యక్రమంలో పాల్గొన్నారు.





