పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన సినిమా ‘పురుష:’. వీరు వులవల దర్శకత్వం వహించారు. సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. మే 22న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బత్తుల పవన్ కళ్యాణ్ ఇలా ముచ్చటించారు.
‘‘ మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నాన్న గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. నన్ను యాక్టర్ను చేయాలనేది నాన్న కోరిక. నాకు కూడా ప్యాషన్ ఉండటంతో చిత్రపరిశ్రమలోకి వచ్చా. వైజాగ్లో సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నా. ఆయన వద్ద నేను ఎంతో నేర్చుకున్నాను.
డీఓపీ సతీష్ గారి వల్లే ఈ ప్రాజెక్ట్ మా దగ్గరకు వచ్చింది. సినిమాలతో ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించాలని అనుకున్నాం. అందుకే నా మొదటి మూవీగా ఇలాంటి ఓ ఫ్యామిలీ కథతో వస్తున్నా. ఫ్యామిలీ ఆడియెన్స్కి నచ్చేలా ఈ మూవీని రూపొందించాం. ఓ మంచి చిత్రాన్ని చూశామన్న ఫీలింగ్తో ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వెళ్తారు.
ఈ చిత్రంలో వీటీవీ గణేష్, వెన్నెల కిశోర్, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి సహా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. అందరూ నాకు ఎంతో సహకరించారు. అన్ని పాత్రలకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాని ఆడియెన్స్ ఎంతో ఎంజాయ్ చేశారు. మా సినిమా కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ని ఆకట్టుకుంటుంది. ఈ ప్రయాణంలో సినిమా ఆర్టిస్టుల కష్టాలన్నీ నాకు తెలిశాయి.
డైరెక్టర్ వీరు అన్న నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. నేను చాలా ఇంట్రోవర్ట్గా ఉండేవాడ్ని. నన్ను నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఆయన ఇచ్చిన సహకారంతోనే సినిమాని బాగా చేయగలిగాను.
‘పురుష:’ సినిమాని ఇప్పటి వరకు చూసిన వారంతా మెచ్చుకున్నారు. కచ్చితంగా విజయం సాధిస్తుందని అన్నారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది. విడుదలైన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. నా ఫ్రెండ్స్ అయితే నన్ను యాక్షన్ చిత్రాలు చేయమని సలహాలు ఇస్తుంటారు. కానీ ఏ జానర్లో సినిమా చేసినా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలన్నదే లక్ష్యం.






