‘పాపం ప్రతాప్’తో తిరువీర్ వీర ప్రతాపం చూపిస్తాడని అన్నారు హీరో శ్రీవిష్ణు. తిరువీర్ హీరోగా ఎస్పి దుర్గ నరేష్ దర్శకత్వంలో కృషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘తిరువీర్ చాలా మంచి సినిమాలు చేస్తున్నారు. ఆడియెన్స్ సినిమాని ఇంకా ప్రమోట్ చేయాలని ఇస్తున్న ఫీడ్బ్యాక్ను మనం ఇప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. మనం నిజాయితీగల కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక శుక్రవారం మనదే అవుతుంది. థియేటర్లు అన్నీ విపరీతంగా ఫుల్ అవుతాయి. ఆ రోజు ఈ సినిమాతో రావాలని కోరుకుంటున్నా. పైగా ఈ మూవీ టికెట్ 99 రూపాయలు మాత్రమే. బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి. కచ్చితంగా ఈ సినిమాతో మీరు సాటిస్ఫై అవుతారని నమ్మకం ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు. శ్రీవిష్ణుతోపాటు డైరెక్టర్ నందిని రెడ్డి, రైటర్ కోన వెంకట్,
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల ఈ కార్యక్రమానికి హాజరై సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.
హీరో తిరువీర్ మాట్లాడుతూ ‘‘మంచి సినిమా చేయడం ఒక ఎత్తు, దాన్ని జనం వరకు తీసుకురావడం మరో పెద్ద ఎత్తు అయిపోయింది ఈ రోజుల్లో. గత రెండు సినిమాల విషయంలో నేను బాధపడ్డాను. ఒక మంచి సినిమా చేసాం కానీ ఇంకా బాగా రీచ్ కాలేదు. గత సినిమా ప్రీ వెడ్డింగ్ షోకి మీడియా, క్రిటిక్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. కానీ జనానికి తెలిసేలోగానే సినిమా థియేటర్ నుంచి వెళ్లిపోయింది. ఓటిటీలో రెస్పాన్స్ బాగున్నప్పటికీ సినిమా థియేటర్లో ఆడితేనే బాగుంటుందని ఫీలింగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం కథకి, క్యారెక్టర్కి దగ్గరగా ఉండే అన్ని ప్రమోషన్స్ చేశాను. ఈసారి జనానికి ఈ సినిమా వస్తుందని తెలిసిందని నమ్ముతున్నా. ఇదొక క్లీన్ ఎంటర్టైనర్. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే సినిమా. ఫీల్ గుడ్ సినిమా. ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు” అని అన్నారు. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ చెప్పారు. డైరెక్టర్ ఎస్.పి. దుర్గ నరేష్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి తీసుకుని రాసిన కథ. కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది” అని చెప్పారు. వంద రూపాయలకే రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు ప్రొడ్యూసర్ రుద్రదేవ్, ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి అన్నారు. ఈటీవీ విన్ కంటెంట్ నితిన్ చక్రవర్తి,ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, నటులు అవసరాల శ్రీనివాస్, అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు.





