Drishyam 3 will stream on Prime Video
భారతీయ సినీ ప్రేక్షకులను ఉత్కంఠతో కట్టిపడేసిన అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్లోని మూడో భాగం ‘దృశ్యం 3’ జూన్ 18 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. మోహన్లాల్, మీనా, సిద్ధిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన అనంతరం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంటుంది.
Drishyam 3 will stream on Prime Video
‘దృశ్యం 2’లో చోటుచేసుకున్న సంఘటనల తర్వాత, జార్జ్కుట్టి తన కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును నిర్మించుకున్నట్లు కనిపిస్తుంది. గత అనుభవాల స్ఫూర్తితో ఆయన నిర్మించిన సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుంది. అయితే గతం పూర్తిగా ముగిసిపోలేదని త్వరలోనే స్పష్టమవుతుంది. ఆ సినిమా వెనుక దాగి ఉన్న నిజాలను వెలికితీయాలనే లక్ష్యంతో ఇద్దరు జర్నలిస్టులు రంగంలోకి దిగుతారు. ఇదే సమయంలో కుమార్తె అంజూకు వచ్చిన వివాహ ప్రతిపాదన అనూహ్యంగా ఒక ప్రమాదకరమైన ఉచ్చుగా మారుతుంది.
పాత శత్రువులు కొత్త ప్రణాళికలతో తిరిగి రంగప్రవేశం చేయడం, భయం, అనుమానాలు, అపరాధ భావనలతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారడం వల్ల జార్జ్కుట్టి మరోసారి తన కుటుంబాన్ని రక్షించేందుకు సాహసోపేతమైన పోరాటం ప్రారంభిస్తాడు. ప్రతి మలుపులో ఉత్కంఠను పెంచుతూ సాగే కథనం, భావోద్వేగాలతో నిండిన కుటుంబ బంధాలు, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ట్విస్టులతో ‘దృశ్యం 3’ మరోసారి అద్భుతమైన థ్రిల్లర్ అనుభూతిని అందించనుంది.