తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్య పోరు..
అసలు ఎవరి కోసం ఈ యుద్ధం..
The Power Struggle in the Telugu Film Industry...
తెలుగు సినిమా పరిశ్రమలో గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఇది కేవలం “పర్సెంటేజ్ విధానం”పై వివాదం మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఆధిపత్యం ఎవరిది? నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? అనే పెద్ద చర్చగా మారిపోయింది. ఒకవైపు ఎగ్జిబిటర్లు తమ సమస్యలు చెబుతుంటే.. మరోవైపు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా తమ వాదన వినిపిస్తున్నారు. దీంతో టాలీవుడ్లో చాలా కాలంగా నిశ్శబ్దంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగమయ్యాయి.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
కొన్ని రోజుల క్రితం ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ నిర్వహించి.. ప్రస్తుతం అమల్లో ఉన్న రెంటల్ విధానం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఇకపై “పర్సెంటేజ్ సిస్టమ్” అమలు చేయాలని డిమాండ్ చేశారు. సినిమాకు వచ్చిన కలెక్షన్లలో శాతం ఆధారంగా థియేటర్లకు వాటా రావాలని వారు స్పష్టం చేశారు. కొన్ని షరతులు అమలు కాకపోతే పెద్ద సినిమాలను కూడా ప్రదర్శించబోమనే స్థాయిలో హెచ్చరికలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అలెర్ట్ అయ్యారు. ఎందుకంటే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అనేక భారీ చిత్రాలు రిలీజ్కు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా కొత్త విధానం తీసుకురావడం పరిశ్రమను మరింత అస్థిరతలోకి నెట్టేస్తుందని నిర్మాతలు అంటున్నారు.
నిర్మాతల వాదన ఏమిటి?
నిర్మాతల మాటల్లో ప్రధానంగా వినిపించిన విషయం ఒక్కటే .. “ఎగ్జిబిటర్లకే కాదు.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కష్టాల్లో ఉన్నారు.” భారీ బడ్జెట్ సినిమాలు, పెరిగిన రెమ్యూనరేషన్స్, మార్కెట్లో తగ్గిన థియేట్రికల్ రన్, ఓటీటీ ప్రభావం.. ఇవన్నీ నిర్మాతలపై భారీ ఒత్తిడిని పెంచాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే కోట్లు నష్టపోతున్న పరిస్థితి ఉంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా అడ్వాన్స్లు పెట్టి భారీగా నష్టపోతున్నారు.
అందుకే నిర్మాతలు చెబుతున్నది ఏమిటంటే..
కొత్త విధానం తీసుకురావాలంటే అందరూ కూర్చొని చర్చించాలి
ఇప్పటికే నిర్మాణంలో ఉన్న సినిమాలపై కొత్త రూల్స్ అమలు చేయకూడదు
థియేటర్ల గ్రేడింగ్, మెయింటెనెన్స్, కన్వినెన్స్ ఫీజులపై కూడా చర్చ జరగాలి
సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా తమ వసతులు మెరుగుపర్చుకోవాలి
The Power Struggle in the Telugu Film Industry...
అంటే.. సమస్య ఒక్క రెంటల్ విధానంతో ముగిసేదిగా లేదన్న మాట.
ఎగ్జిబిటర్ల అసలు బాధ ఏంటి?
సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి ప్రస్తుతం చాలా క్లిష్టంగా ఉంది. ఓటీటీలు పెరగడం, చిన్న సినిమాలకు ప్రేక్షకులు తగ్గడం, భారీ సినిమాలు మాత్రమే థియేటర్లను నిలబెట్టడం.. ఈ పరిస్థితుల్లో అనేక థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ప్రత్యేకంగా చిన్న పట్టణాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. సినిమా ఆడకపోయినా ఫిక్స్డ్ రెంట్లు, కరెంట్ బిల్లులు, ఉద్యోగుల జీతాలు భరించాల్సి వస్తోందని వారి వాదన.
అయితే నిర్మాతల ప్రశ్న మాత్రం వేరేలా ఉంది ..
“సినిమా బాగోలేక ప్రేక్షకులు రాకపోతే దానికి నిర్మాతే బాధ్యత వహించాలా? థియేటర్ యజమానులు కూడా తమ వ్యాపార శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదా?” అని ప్రొడ్యూసర్స్ అంటున్నారు.
ఈ వివాదం వెనుక అసలు ఆధిపత్య పోరేనా?
ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ ఇదే. ఈ వివాదం కేవలం వ్యాపార విధానాల గురించే కాదు.. టాలీవుడ్లో ఎవరి మాట ఫైనల్ అవ్వాలి? అనే అంశం కూడా ఇందులో దాగి ఉందని చాలామంది భావిస్తున్నారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మూడు ప్రధాన శక్తులు ఉన్నాయి: నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. ఇప్పటివరకు ఈ మూడు వ్యవస్థలు పరస్పర ఆధారితంగా పనిచేశాయి. కానీ ఇప్పుడు ప్రతి వర్గం తమ బలం పెంచుకునే ప్రయత్నంలో ఉంది.
ప్రత్యేకంగా:
మల్టీప్లెక్స్ చైన్ల ప్రభావం పెరగడం
కొద్దిమంది చేతుల్లో థియేటర్ల నియంత్రణ ఉండటం
భారీ సినిమాల మార్కెట్ పూర్తిగా స్టార్ హీరోల చుట్టూ తిరగడం
ఓటీటీలు కొత్త శక్తిగా ఎదగడం
ఇవన్నీ పరిస్థితులను మార్చేశాయి.
“పెద్ద (పెద్ది) సినిమాల” సమయానికే ఎందుకు వివాదాలు?
ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్. ప్రతి సారి భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలోనే ఇలాంటి చర్చలు ఎందుకు తెరపైకి వస్తున్నాయనే ప్రశ్న నిర్మాతలు లేవనెత్తుతున్నారు. పైగా కొన్ని రోజుల్లో భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ విడుదల సమయంలోనే మళ్లీ ఈ ఇష్యూ గుర్తొచ్చిందా అంటూ ఎగ్జిబిటర్లపై ప్రొడ్యూసర్స్ ఫైర్ అవుతున్నారు.
ఇండస్ట్రీలో కొందరి అభిప్రాయం ప్రకారం:
పెద్ద సినిమాల సమయంలో ఒత్తిడి తీసుకొస్తే తమ డిమాండ్లు త్వరగా నెరవేరుతాయని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి
మరోవైపు నిర్మాతలు కూడా భారీ సినిమాల బిజినెస్ను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు
దీంతో ప్రతి పెద్ద రిలీజ్ ముందు ఒక రకమైన పవర్ గేమ్ కనిపిస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కువగా నష్టపోతున్నది ప్రేక్షకుడేనని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు.
టికెట్ ధరలు పెరిగినా విమర్శలు ప్రేక్షకుడి నుంచే వస్తున్నాయి.
థియేటర్ వసతులు బాగోలేకపోయినా అసంతృప్తి ప్రేక్షకుడిదే.
సినిమా విడుదల ఆలస్యమైనా ప్రభావం అభిమానులపైనే పడుతోంది.
The Power Struggle in the Telugu Film Industry...
అందుకే ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న ..
“ఇండస్ట్రీలో ఈ ఆధిపత్య పోరు చివరకు సినిమాను కాపాడేందుకా? లేక ఎవరి ఆధిపత్యం నిలబెట్టేందుకా?”
ముందేం జరుగొచ్చు?
ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల మధ్య కీలక సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా పర్సెంటేజ్ విధానానికి వెళ్లే ముందు కొన్ని దశల వారీ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది .
తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ఒక కీలక మలుపు వద్ద నిలిచింది. ఇకపై కేవలం స్టార్ హీరోలు, భారీ బడ్జెట్లు మాత్రమే కాదు.. వ్యాపార నమూనా కూడా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సినిమా నడిస్తేనే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ ముగ్గురూ నిలబడతారు.
కానీ ముగ్గురి మధ్య నమ్మకం దెబ్బతింటే.. మొత్తం వ్యవస్థనే దాని ప్రభావం తాకే ప్రమాదం ఉంది.
మరోవైపు జూన్ 4న వరల్డ్వైడ్గా విడుదల కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్కు ముందే ఈ వ్యవహరం ఓ కొలిక్కి వస్తుందో రాదో వేడి చూడాలి.





