యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబోలో సినిమా అంటేనే.. అనౌన్స్ చేసిన రోజు నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కమల్ నిర్మాతగా, రజినీ కాంత్ హీరోగా కొన్నాళ్ల క్రితం ఓ సినిమా ప్రకటించగా.. దీనికి ముందుగా సుందర్ సి ను దర్శకుడిగా అనౌన్స్ చేశారు. అయితే కొన్ని రోజులకు ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో ఆయన ప్లేస్ లోకి డాన్ డైరెక్టర్ శిబి చక్రవర్తిని ఫైనల్ చేశారు. ఈ కాంబో దాదాపు ఖాయమై ఈ నెలలో సెట్స్ కు వెళ్లాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు శిబి చక్రవర్తి కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ లోకి అశ్వత్ మారిముత్తు ఎంటర్ అయ్యాడని తెలుస్తుంది. తమిళంలో ఓ మై కడవులే (తెలుగులో ఓరి దేవుడా రీమేక్) రూపొందించిన అశ్వత్ చేతికి ఈ భారీ ప్రాజెక్ట్ వెళ్ళిందని కోలీవుడ్ టాక్. కమల్, రజినీ సినిమాకు.. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అశ్వత్ అయినా ఈ సినిమా ను మొదలు పెడతాడో లేదో చూడాలి. రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థ పై ఆర్. మహేంద్రన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మాస్ అప్పీల్, ఎమోషన్, హై క్యాలిటీ మేకింగ్తో తెరకెక్కించబోతున్నట్టు మేకర్స్ తెలియజేశారు. రజినీకాంత్ కెరీర్లో ఇది 173వ చిత్రం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది పొంగల్కి రిలీజ్ చేయనున్నట్టు మాత్రం ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రజినీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్తో ‘జైలర్ 2’ మూవీ చేస్తున్నారు. అలాగే నెల్సన్ డైరెక్షన్లోనే రజినీకాంత్, కమల్ హాసన్ హీరోలుగా రీసెంట్గా ఓ చిత్రాన్ని ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






